Mahasabhalu – 2026 | Day 1 | 09th Feb | 98వ వార్షిక జ్ఞాన మహాసభలు

వార్షిక మహాసభలు – మొదటి రోజు విశేషాలు

ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే పీఠం 98వ వార్షిక జ్ఞాన మహా సభలు ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో సద్గురువర్యులు సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సద్గురువర్యులు మొదటి రోజు సభలో అనుగ్రహ భాషణం చేస్తూ త్రయీ సాధన అనే ఆధ్యాత్మిక దిక్సూచి ద్వారా మానసిక స్థిరత్వం, ధైర్యం అలవడి జీవన విధానం సుఖమయం చేసుకోవచ్చునని తెలిపారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే ఉద్రేకం అనే అగ్నిని సహనం అనే నీటి ద్వారా చల్లార్చాలని అన్నారు. మానవుడు తనలో అంతర్లీనంగా ఉన్న జ్ఞాన నేత్రాన్ని గుర్తించగలిగితే, తద్ద్వారా భగవంతుడిని దర్శించవచ్చునని పేర్కొన్నారు. మానవుడిని మహనీయుడిగా మలిచే జ్ఞాననేత్రం పొందడానికి గురుముఖంగా ఆధ్యాత్మిక తత్త్వాన్ని గ్రహించాలని తెలిపారు.

రైల్వే బోర్డ్ మెంబర్ నూర్ అహ్మద్, హుస్సేన్ షా, పీఠం సభ్యులు ఎ.వి.వి. సత్యనారాయణ, రేఖా సత్యనారాయణ, ఎన్. ఆర్. ఐ. దిడ్డి సూర్యకుమార్, ఎన్. ఆర్.ఐ. శ్రీధర్, డాక్టర్ ఎన్. రాంగోపాల్ వర్మ, కె. స్వర్ణలత, టి. సాయివెంకన్న బాబు, చింతపల్లి అమృతవల్లి తదితరులు ప్రసంగిస్తూ జలతత్వం, పృథ్వీతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశ తత్వములను గురించి సమగ్రంగా వివరించారు. వందలాది సంవత్సరాలుగా వేదాంత విద్యను కాలానుగుణ్యంగా ఉపదేశిస్తున్న విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక యూనివర్సిటీ పీఠం అని పేర్కొన్నారు. గురువు ద్వారా తాత్త్విక జ్ఞానాన్ని పొందినవారు మంత్రమే గురువు, గురువే మంత్రం అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అని తెలియబరుస్తున్న మహోన్నత పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు.

ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు, కాకినాడ జిల్లా డిసిసిబి ఛైర్మెన్ తుమ్మల రామస్వామి అలియాస్ బాబు, వాసిరెడ్డి ఏసుదాస్, ప్రముఖ కవి, రచయిత యామిజాల ఆనంద్, ప్రముఖ కవి డాక్టర్ శిరీష్, సినీ మాటల రచయిత పోలగాని భాను తేజశ్రీ, యోగభారతి ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ జ్యోతుల నాగేశ్వరరావు, భారత్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ గట్టి శ్రీకృష్ణ దేవరాయలు, ఒ.ఎన్. జి. సి. ఇంజనీర్ చిన్ని సత్యనారాయణమూర్తి తదితరులు పీఠాధిపతి వారిని దర్శించుకొన్నారు.

సంగీత విభావరిలో ఎ.ఉమ బృందం ఆలపించిన కీర్తనలు సభ్యులను రంజింపచేసాయి. సభలో పాల్గొనడానికి దేశ, విదేశాల నుండి విచ్చేసిన వేలాదిమంది సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించారు.

MahaSabha Day1 – Morning Photo gallery

MahaSabha Day1 – Eventing Photo gallery

You may also like...