Mahasabhalu – 2026 | Day 2 | 10th Feb | 98వ వార్షిక జ్ఞాన మహాసభలు

వార్షిక మహాసభలు – రెండవ రోజు విశేషాలు

ఆధ్యాత్మిక చైతన్యమే సామాజిక చైతన్యానికి బీజం వేస్తుందని, ఆధ్యాత్మిక తత్త్వం మనసుకు దశ, దిశ నిర్దేశిస్తుందని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 98వ వార్షిక జ్ఞాన మహాసభల్లో భాగంగా రెండవరోజు 10-2-26 మంగళవారం పిఠాపురం ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో పీఠాధిపతివారు అనుగ్రహ భాషణ చేసారు. మానవునిలోని కలి కల్మషాలను, జడ కాలుష్యాలను తొలగించి అంతర్లీనంగా ఉన్న దైవత్వాన్ని వెలికితీయడమే ఈ పీఠం యొక్క తత్త్వమని తెలిపారు. ఆధ్యాత్మిక తత్త్వాన్ని గ్రహించడం ద్వారా మానవుడు తన జీవనయానంలో ఎదురయ్యే అశాంతి, ఆందోళన, ఒత్తిడి వంటి వాటి నుండి విముక్తి పొందవచ్చునని అన్నారు.

మానవుడు రాక్షసత్వం వీడి ఈశ్వరత్వం వైపు పయనించాలంటే ఆధ్యాత్మిక తత్త్వాన్ని గ్రహించాలని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక తత్త్వం, తాత్త్విక జ్ఞానంతో పొందే తాత్త్విక శక్తితో మనసును మంచి మార్గంవైపు మరల్చుకోవచ్చునని అన్నారు. అరిషడ్వర్గాలను స్థాయిపరచుకుంటే అది సాధ్యమౌతుందని తెలిపారు. పీఠం అందిస్తున్న ధ్యాన, జ్ఞాన, మంత్ర సాధనలతో కూడిన త్రయీసాధన అవలంబించడం ద్వారా మనసులో ఉద్భవించే చెడు భావనలు నియంత్రించబడతాయని అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ పీఠాలను, ఆలయాలను, గురువులను సందర్శించినా ముక్తి పొందలేరని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను దైవాలుగా భావించి గౌరవించాలని సూచించారు. ఆధ్యాత్మిక ప్రబోధం, సామాజిక సేవలను రెండు నేత్రాలుగా చేసుకుని ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అని వెల్లడించారు.

అనంతరం పీఠం రూపొందించిన పరతత్త్వ కీర్తనములు గ్రంథం, పీఠం తెలుగు, ఇంగ్లీష్, హిందీ బ్రోచర్ లను అతిథుల సమక్షంలో పీఠాధిపతివారు ఆవిష్కరించారు. తదుపరి మురమళ్లకు చెందిన బాణాల సిద్ధాంతి పీఠాధిపతి ఉమర్ ఆలీషా స్వామివారిని గజమాలతో ఘనంగా సత్కరించారు.

సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సీ, కిమ్స్ మెడికల్ కాలేజీ ఛైర్మన్ చైతన్య రాజు, ప్రముఖ సిద్ధాంతి గరిమెళ్ల వెంకటరమణ, గిడుగు రామమూర్తి మనుమరాలు గిడుగు క్రాంతి కృష్ణ వారలు మాట్లాడుతూ ఆధ్యాత్మిక తత్త్వ ప్రబోధం ద్వారా ప్రతివ్యక్తిలోనూ మానవత్వపు విలువలను పెంపొందించడానికి నిరంతరం పాటుపడుపడుతున్న పీఠాన్ని సందర్శించడం తమకెంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠం అందిస్తున్న సేవలను ప్రశంసించారు.

ఈ సభా కార్యక్రమంలో అవధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, కె. సూర్యలత, ఎన్.టి.వి. ప్రసాదవర్మ, కృష్ణ, జి.రమణ, పి. మంజుల తదితరులు సభలో ప్రసంగిస్తూ గురు శిష్యుల సంబంధం అత్యంత ప్రాధాన్యంతో కూడుకున్నదని తెలిపారు. నమ్మిన గురువుతో పరిపూర్ణమైన ప్రయాణం చేస్తే శిష్యుని జీవితం సార్థకమౌతుందని వెల్లడించారు. అత్యంత ప్రాచీనమైన సనాతన పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో సభ్యులు కావడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అఖిల భారత భవానీ దీక్షా పీఠం వ్యవస్థాపకులు శివరామకృష్ణ స్వామీజీ, గీతా పారాయణం నిర్వాహకులు అడపా సీతాపతి, పరవస్తు పద్య పీఠం స్థాపకులు ఫణిశయన సూరి,
యోగా గురువు కరిబండి రామకృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా లయన్స్ గవర్నర్, కైండ్ నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టెం మాణిక్యాలరావు, కళారత్న, అఖండ శంఖారావ యుగళం కొండా నరసింహారావు, పిఠాపురం సీఐ శ్రీనివాస్, మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ ఛైర్మన్ పిల్లి తిరుపతిరావు, తదితరులు పీఠాధిపతివారిని దర్శించుకున్నారు.

సభలో నిర్వహించిన సంగీత విభావరిలో ఎ.ఉమ బృందం ఆలపించిన కీర్తనలు అందరినీ రంజింపచేసాయి. సభలో పాల్గొనడానికి దేశ, విదేశాలనుండి విచ్చేసిన వేలాదిమంది సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించారు.

MahaSabha Day2 – Morning Photo Gallery

MahaSabha Day2 – Afternoon Photo Gallery

You may also like...