97th Annual Congregation | MahaSabhalu – 09th Feb 2025 – Day 1
9th Feb 2025 – MahaSabha Day 1 – 9-ఫిబ్రవరి -2025 వార్షిక మహాసభ – మొదటి రోజు
“ముక్తి ద్వారానే మానవ జన్మకు సార్ధతకత కలుగుతుంది”………..పీఠాధిపతులు డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు
84 లక్షల జడజన్మల అనంతరం పొందే అరుదైన మానవజన్మకు ముక్తి ద్వారానే సార్థకత కలుగుతుందని పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అన్నారు. పిఠాపురం, కాకినాడ రోడ్ నందలి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభలు ఆదివారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో పీఠాధిపతి సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలీషా స్వామివారు మాట్లాడుతూ జీవాత్మ పరమాత్మగా పరిణామం చెందే అద్భుత అవకాశం ఒక్క మానవజన్మకు మాత్రమే ఉందని అన్నారు. ముక్తిని పొంది తరించడం కోసం జీవాత్మ మానవునిలోని మానసిక, శారీరక వ్యవస్థలో ప్రేరణ కలిగిస్తుందని పేర్కొన్నారు. ధర్మ మార్గాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే ముక్తిని పొందగలుగుతారని తెలిపారు. ముక్తిని పొందాలంటే కోరికలు లేని స్థితికి మానవుడు చేరుకోవాలని, అందుకోసం గురువును ఆశ్రయించి ఆధ్యాత్మిక, తాత్త్విక జ్ఞానాన్ని గ్రహించాలని వెల్లడించారు.
శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠమునందు అందిస్తున్న జ్ఞాన, ధ్యాన, మంత్ర శక్తులతో కూడిన త్రయీసాధనను అవలంబించడం ద్వారా భుక్తి, తృప్తి, ముక్తి లభిస్తాయని తెలిపారు. మానవ జీవన పరిణామ క్రమంలో అండం పిండంగా మారే గర్భస్థ దశలో తాత్త్విక జీవన రసాయన తత్వం, బాల్య దశలో తాత్త్విక బాలవికాస్ తత్వం, యౌవన దశలో యువ వికాస్ తత్వం, కౌమార దశలో ఆధ్యాత్మిక, తాత్త్విక జ్ఞాన తత్వం, వృద్ధాప్య దశలో భ్రాంతి తత్వం నుండి ఈశ్వరత్వం తేలిపే తత్వాలను పీఠం బోధిస్తుందని తెలిపారు. మానవతా విలువల పరిరక్షణ కొరకు పాటుపడుతున్న పీఠం విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు.
సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిబిఐ మాజీ జెడి, వి.వి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠమునందు పీఠాధిపతి ఉమర్ ఆలీషావారి మహాసభల నిర్వహణ ద్వారా మేధామథనం చేపట్టి, మనుషులందరినీ కలిపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందరనీ కలిపే తత్వం భారతీయ తత్వమని, అలాంటి తత్వాన్ని సభ్యులకు ఉపదేశిస్తూ మంచి మనుషులతో కూడిన సత్సంఘాన్ని ఏర్పాటు చేస్తున్న మహోన్నతులు సద్గురు ఉమర్ ఆలీషా అని కొనియాడారు. నమ్మిన గురువుతో పరిపూర్ణమైన ప్రయాణం చేస్తే శిష్యుని జీవితం సార్థకమౌతుందని వెల్లడించారు. పీఠం విశిష్టతను మారుమూల పల్లెలవరకూ విస్తరింపచేసేలా శిష్యులు కృషి చేయాలని సూచించారు.
అనంతరం నివేదిక 2025, పీఠం మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ విశిష్టతలను తెలిపే ఆంగ్లము, తెలుగు బ్రోచర్స్
ముఖ్య అతిథులు సిబిఐ మాజీ జెడి వివి.లక్ష్మీనారాయణ, కాకినాడ జిల్లా 3వ అడిషనల్ జడ్జ్ పి.కమలాదేవి, నర్తన ఋషి డాక్టర్ సప్పా దుర్గా ప్రసాద్ గార్లచే పీఠాధిపతివారు ఆవిష్కరింపచేశారు.
తదుపరి ఉమర్ ఆలీషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ హుస్సేన్ షా, చింతపల్లి అమృతవల్లి, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యుడు డా.పింగళి ఆనంద్ కుమార్, కె. స్వర్ణలత, డా. ఎన్. రాంగోపాల్ వర్మ, ఎన్.ఆర్.ఐ సభ్యులు టి.ఎస్.వి. శ్రీనివాస్, సూర్య కుమార్, ఉషారాణి గార్లు మాట్లాడుతూ సద్గురుని ఆశ్రయించి తాత్విక జ్ఞానాన్ని గ్రహించడం ద్వారా మానవుడు తన జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చని వివిధ విషయాలను, తాత్విక సందేశాలను అన్వయిస్తూ తెలిపారు. గురువు ఆదేశాలను శిష్యులు పాటించాలని అన్నారు. పంచభూతాల సహకారంతోనే మానవుని జీవితం కొనసాగుతుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి నిస్వార్థ జీవనం కొనసాగిస్తూ, కృతజ్ఞతను కలిగి ఉండాలని పేర్కొన్నారు. స్త్రీ సంక్షేమం, సర్వమత సౌభ్రాతృత్వం కొరకు పీఠాధిపతులు చేస్తున్న కృషిని కొనియాడారు.
ఈ సందర్బంగా పిఠాపురం సీఐ శ్రీనివాస్, జె.ఎన్.టి.యు ప్రొఫెసర్ డాక్టర్ ఎల్. సుమలత, డాక్టర్ హరనాథ్ రాజు, సౌత్ సెంట్రల్ రైల్వే, సబర్బన్ ట్రైన్స్ జనరల్ సెక్రటరీ నూర్ అహ్మద్ ఆలీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వేర్ హౌస్ మేనేజర్ కె. సుధాకర్ రెడ్డి, యోగరత్న డాక్టర్ జ్యోతుల నాగేశ్వరరావు తదితరులు పీఠాధిపతులను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు.
ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు చిన్నారుల కొరకు పాలకేంద్రం, శిశు సంరక్షణా కేంద్రాలు, ప్రాథమిక వైద్య శిబిరాలు, సోలార్, డ్రోన్ స్టాల్స్ తో పాటుగా 32 కేంద్రాలను ఏర్పాటు చేసారు.
సభలో పాతూరి కొండలరెడ్డి ఆలపించిన పద్య గానం, తాత్విక బాలవికాస్ విద్యార్థులు నంద్యాల యశ్వంత్, బాదం ఊర్విషాల ఆధ్యాత్మిక ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సంగీత విభావరిలో ఉమాముకుంద బృందం ఆలపించిన కీర్తనలు సభికులను రంజింపచేసాయి. సభలో పాల్గొనడానికి దేశ, విదేశాలనుండి విచ్చేసిన సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. ఎంతో వైభవోపేతంగా మొదటి రోజు సభాకార్యక్రమం జరిగింది.
9th Feb 2025 – Morning
9th Feb 2025 – Evening