Guru Pournami Sabha | The Guru — The Guide Who Removes Ignorance and Leads Toward Knowledge | 29th July 2026
అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానం వైపు నడిపించే మార్గదర్శకుడు – గురువు
శిష్యుడిలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి, జ్ఞానం అనే వెలుగువైపు నడిపించే మార్గదర్శకుడు గురువు అని, గురువు కేవలం సమాచారం అందించడమే కాకుండా జీవన సత్యాన్ని అర్థం చేసుకునే దారిని చూపుతాడని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం పిఠాపురం
ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అనుగ్రహ భాషణ చేసారు. సముద్రంలో ఉన్న అలలు వేర్వేరుగా కనిపించినా, అవన్నీ నీరే అయినట్లుగా మనుషులు వేర్వేరుగా కనిపించినా, వారి అసలు స్వరూపం ఒకే పరబ్రహ్మ చైతన్యమని పేర్కొన్నారు. నీవు మరియు పరమాత్మ వేర్వేరు కాదు ఇద్దరూ ఒకటే, ఆ పరబ్రహ్మ స్వరూపుడివి నీవే అనే విషయాన్ని గురువు శిష్యుడికి ప్రబోధిస్తాడని దీనినే ఆధ్యాత్మిక పరిభాషలో తత్త్వమసి అంటారని తెలిపారు. జీవాత్మ, పరమాత్మల ఏకత్వాన్ని తత్త్వమసి అనే ఈ వాక్యం తెలియజేస్తుందని వెల్లడించారు.
మానవుడు ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడంతో పాటుగా సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాలుపంచుకోవాలని సూచించారు. ఆధ్యాత్మిక చైతన్యమే సామాజిక చైతన్యానికి బీజం వేస్తుందని
తెలిపారు. సామాజిక నేత్రం, ఆధ్యాత్మిక నేత్రాలను వృద్ధిచేసుకుంటే, తాను కోరుకునే ముక్తికి మార్గం సుగమమౌతుందని అన్నారు. ధ్యాన, జ్ఞాన, మంత్ర సాధనలతో కూడిన త్రయీ సాధనను అవలంబించడం ద్వారా మానవుడు తనలోని అరిషడ్వర్గాల ప్రభావాన్ని స్థాయి చేసుకోగలుగుతాడని తెలిపారు. మనస్సును, శరీరాన్ని ఏకీకృతం చేసే శక్తిని ధ్యాన సాధన కల్పిస్తుందని అన్నారు. ఆత్మ పరమాత్మగా పరిణామం చెందే విధానాన్ని ఈ ధ్యానశక్తి చూపుతుందని తెలిపారు. మానవునిలో ఆధ్యాత్మిక జీవన తత్త్వము ఏర్పడాలంటే జ్ఞానాన్ని ప్రసాదించే సద్గురువుల విశిష్టత సమాజంలో విస్తరింపబడాలని అన్నారు.
తదుపరి డాక్టర్ కొండా నరసింహారావు, అలివేలు మంగాదేవి దంపతులు సభలో చేసిన అఖండ శంఖారావం సభను రంజింపచేసింది. గురు పౌర్ణమిని పురస్కరించుకొని పీఠం సభ్యులు పీఠాధిపతి ఉమర్ ఆలీషా సద్గురువర్యులకు పాదపూజ
నిర్వహించారు. అనంతరం అహ్మద్ ఆలీషా, ‘అవధాన కళాధర’ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, ఎన్.ఆర్.ఐ. కాకర్లపూడి ఉమా తపస్వి గురువు యొక్క విశిష్టతను తెలుపుతూ సభలో చేసిన ఆధ్యాత్మిక ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పీఠం సభ్యురాలు ఉమా ముకుంద సంగీత పర్యవేక్షణలో సభ్యులు ఆలపించిన కీర్తనలు రంజింప చేసాయి.












