Mahasabhalu – 2026 | Day 3 | 11th Feb | 98వ వార్షిక జ్ఞాన మహాసభలు

వార్షిక మహాసభలు – మూడవ రోజు విశేషాలు

సామాన్యుని నుంచి తత్త్వవేత్తల వరకూ కాలం అందరినీ పరీక్షిస్తుందని, కాలపరీక్షకు ఎవరూ అతీతులు కాదని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 98వ వార్షిక జ్ఞాన మహాసభల ముగింపు సందర్భంగా పిఠాపురం ప్రధాన ఆశ్రమంలో 11-2-26, బుధవారం జరిగిన సభలో పీఠాధిపతివారు అనుగ్రహ భాషణ చేశారు. ఆధ్యాత్మిక, తాత్త్విక జ్ఞానం పెంపొందించుకోవడం ద్వారా కాలం పెట్టే పరీక్షలను తట్టుకునే శక్తి లభిస్తుందని పేర్కొన్నారు. అసూయ, ద్వేషం, పగ వంటి దుష్ట భావాలు మానవత్వాన్ని నశింపజేస్తాయని, ఆధ్యాత్మిక తత్త్వామృతము ద్వారా మానవత్వ పరిమళాలు సమాజంలో విస్తరించాలని సూచించారు. “నా మొక్క – నా శ్వాస” కార్యక్రమంలో భాగంగా ప్రతి సభ్యుడు మూడు మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటే ప్రతి మొక్క ఒక ఆక్సిజన్ సిలిండర్‌తో సమానమని అన్నారు.

ఈ సందర్భంగా తత్త్వమార్గం ఆధ్యాత్మిక డైరీ, ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ బ్రోచర్, సమాచారదర్శిని (తెలుగు, హిందీ) తదితర ప్రచురణలను ఆవిష్కరించారు.
పలువురు ప్రముఖులు ప్రసంగిస్తూ గురువును ఆశ్రయించి జ్ఞానసాధన చేయడం ద్వారా ఆత్మతత్వం అవగతమవుతుందని తెలిపారు. పీఠం చేపడుతున్న పర్యావరణ, సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.
కుట్టు మిషన్లు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పక్షుల ఆహారం కోసం ధాన్యపు కుచ్చులు పంపిణీ చేశారు. తాత్త్విక బాలవికాస్ చిన్నారుల ప్రసంగాలు, సంగీత విభావరి అందరినీ ఆకట్టుకున్నాయి.

MahaSabha Day3 Photo Gallery

You may also like...