29th Anniversary Spiritual Meeting at Tuni on 2nd March 2026 | 29వ వార్షిక ఆధ్యాత్మిక మహాసభ

29th Communal Harmony Meet@Tuni 2nd Mar 2026

“మానవత్వమే మతము – మానవత్వమే ఈశ్వరత్వము”

ప్రేమ, శాంతి, తృప్తి ద్వారా మానవత్వమే ఈశ్వరత్వమని గ్రహించవచ్చు అని, దానిని త్రయీ సాధన ద్వారా అనుభవంలో గ్రహించాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అనుగ్రహ భాషణ చేశారు. తుని పట్టణంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెనేషా వలీ సద్గురువర్యుల దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సర్వమత సమ్మేళన సదస్సుకు పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామివారు అధ్యక్షత వహించగా, హిందూ మత ప్రతినిధి డా. శ్రీపాద సీతామహాలక్ష్మి సత్యవతి పేరమాంబ, ఇస్లాం మత ప్రతినిధిగా షేక్ అహ్మద్ జానీ, క్రైస్తవ మత ప్రతినిధిగా ఎస్. బాల శౌరి, బౌద్ధ మత ప్రతినిధిగా మహోదయ ఎన్. పెద్దిరాజు, పీస్ ఫౌండేషన్ విజయవాడ శ్రీ అహ్మద్ పాషా వారలు మత సమరస్య సదస్సులో పాల్గొని, ప్రసంగించి, అనంతరం చెయ్యి చెయ్యి పైకెత్తి, దేశ సమగ్రత, విశ్వ మానవ శాంతి కోసం పాటు పడతామని ప్రతిజ్ఞ చేసారు.

ఈ సందర్భంగా పీఠాధిపతి డా. ఉమర్ అలీషా స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తూ 250 సంవత్సరాల క్రితం చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెనేషా వలీ సద్గురువర్యులు ఈ దర్గా ప్రాంగణంలో ఉండి, భిన్నత్వంలో ఏకత్వం తెలియచేయు ఆర్ష సూఫీ తత్త్వం ప్రబోధించుటయే కాక, కల్కి భాగవతం అనే గ్రంథం దరువు కీర్తనల రూపంలో రచించారు అని అన్నారు. ఆ కీర్తనల రూపంలో ఉన్న తత్వాన్ని అవగాహన చేసుకొంటే ఈశ్వరత్వం మానవత్వ రూపంగా తెలియబడి అదే విశ్వమానవ మతం అనే ఆధ్యాత్మిక భావం ఏర్పడుతుంది అని అన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు వివిధ మత ప్రతినిధులను సత్కరించగా, స్వామివారిని తుని కమిటీ సభ్యులు సత్కరించారు. స్వామి వారు జ్యోతి ప్రజ్వలన చేసి, మత సామరస్య సదస్సును ఆవిష్కరించారు. ముందుగా పీఠం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక, సాహిత్య, సేవా కార్యక్రమాలు తెలియచేసే ఫోటో ఎగ్జిబిషన్ మరియు ఉచిత మజ్జిగ చలివేంద్రమును ఆవిష్కరించారు.

నోబెల్ ఐటిఐ కరెస్పాండెంట్ శ్రీ గోసుల వీర వెంకట సత్యనారాయణ 2026 నివేదికను తెలియజేశారు. పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు పీఠ చరిత్రను వివరించారు. హిందూ, ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధ మత ప్రతినిధులు తమ మతాల విశిష్టత, శాంతి, నీతి, సన్మార్గం గురించి సందేశాలు అందించారు. పీస్ ఫౌండేషన్ అధినేత శ్రీ అహ్మద్ పాషా మత సమరస్య సదస్సును అభినందించారు. మిర్జా మజ్దూర్ అహ్మద్ రచించిన “వరల్డ్ క్రైసిస్ – పీస్” గ్రంథాన్ని డా. ఉమర్ ఆలీషా స్వామివారు ఆవిష్కరించి మత ప్రతినిధులకు అందజేశారు. కార్యక్రమంలో భారీగా ప్రజలు పాల్గొని సర్వమత సామరస్య సందేశాన్ని గ్రహించారు.

You may also like...