Pillanka Jnana Sabha | 17th June 2026 | పిల్లంకలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ పునః ప్రతిష్ఠ
“భగవంతుడిని స్మరిస్తూ దినచర్య ప్రారంభించాలి”
పిల్లంకలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ పునః ప్రతిష్ఠలో పాల్గొన్న పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అనుగ్రహ భాషణం చేస్తూ భగవంతుని స్మరించుకుంటూ దినచర్య ప్రారంభిస్తే, భగవంతుని కృప లభిస్తుందని అన్నారు. బుధవారం (17-6-26) కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంకలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో సద్గురు డా. ఉమర్ ఆలీషా స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పీఠాధిపతికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. తదుపరి సద్గురువర్యులు ఆలయాన్ని, యాగశాలను దర్శించారు. ఈ సందర్బంగా వేద పండితులు ఆలయం యొక్క ప్రాముఖ్యాన్ని వివరించారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో సద్గురువర్యులు మాట్లాడుతూ ఓంకార స్వరూపమే బ్రహ్మ స్వరూపము, బ్రహ్మ స్వరూపమే రస స్వరూపమని, అదే అహం బ్రహ్మాస్మిగా అనుభవంలో గ్రహించవచ్చు అన్నారు. శారీరక, మానసిక, ఆత్మ తత్త్వాలుగా, అనగా మంత్ర, జ్ఞాన, ధ్యాన తత్త్వాలుగా త్రయీ సాధన ఆచరించి, దేహానికి భుక్తి, మనస్సుకు తృప్తి, ఆత్మకు ముక్తిని పొంది మానవ జన్మకు సార్థకత కల్పించుకోవాలని సద్గురువర్యులు ప్రబోధించారు. ఈ సందర్భంగా శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి శక్తి కేంద్రాన్ని దర్శించి, భగవంతుని ఆశీస్సులు పొందాలని సద్గురువర్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు దాతలు శ్రీ వేలూరి కామేశ్వరశర్మ, దాట్ల బాబీరాజు, సాగి భీమేశ్వరరాజు, ధర్మకర్త సాగి శివరామరాజు, సాగి భీమేశ్వరరావు, సాగి జ్యోతికుమారి తదితరులు పాల్గొన్నారు.
